Trilateral Meet : ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు (Russia president) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) ఇటీవల అలాస్కాలో భేటీ అయ్యారు. అనంతరం త్రైపాక్షిక సమావేశం (Trilateral Meet) గురించి ట్రంప్, జెలెన్స్కీ (Zelensky) ఫోన్లో మాట్లాడుకున్నారు.
ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పుతిన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని ట్రంప్ యూరోపియన్ యూనియన్ నాయకులతో చెప్పినట్లు సమాచారం. ఇదిలావుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ట్రంప్తో భేటీ కానున్నారు.
ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జర్మన్ ఛాన్సెలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ.. ట్రంప్, జెలెన్స్కీల మధ్య సోమవారం సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని అన్నారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
కాగా ఉక్రెయిన్తో యుద్ధం గురించి ఇటీవల అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్లు భేటీ అయ్యి రెండున్నర గంటలకుపైగా చర్చించారు. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందానికి రాలేదు. అయితే చర్చలు సానుకూలంగా జరిగాయని సమావేశం అనంతరం ఇరువురు నేతలు ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఒప్పందంపై నిర్ణయం జెలెన్స్కీ చేతుల్లోనే ఉందన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధినేత తెలిపారు.
త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదిక అవుతుందన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ నాయకులకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే సోమవారం ట్రంప్, జెలెన్స్కీ సమావేశం నేపథ్యంలో ఐరోపా నేతలు అప్రమత్తమయ్యారు. గతంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ట్రంప్తో స్నేహపూర్వకంగా మెలిగే ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ను, ఇతరులను ఉక్రెయిన్ అధ్యక్షుడికి సాయంగా వాషింగ్టన్కు పంపనున్నట్లు యూరప్ దౌత్యవేత్తలు తెలిపారు.
ఇరువురి మధ్య ఘర్షణ పునరావృతం కాకుండా చర్చలు సజావుగా జరిగేలా వారు చూసుకోనున్నట్లు సమాచారం. నాటో సెక్రెటరీ జనరల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని ఓ మీడియా కథనం పేర్కొంది.