గౌహతి: కొందరు వ్యక్తులు ఇద్దరు గిరిజన బాలికలను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులైన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. (Tribal Girls Gang Raped) అస్సాంలోని కచార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మిజోరామ్కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. కదులుతున్న కారులో ఇద్దరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, ఆగస్ట్ 3న తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు బాధిత ఇద్దరు బాలికలు ధోలై పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి ప్రయత్నించారని, తాము ప్రతిఘటించినప్పటికీ ఆ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు.
మరోవైపు బాధిత మైనర్ బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులను రాజ్నగర్కు చెందిన 20 ఏళ్ల అమ్జాద్ హుస్సేన్ లస్కర్, భగా బజార్కు చెందిన 23 ఏళ్ల సద్దాం హుస్సేన్ లస్కర్, ఖాస్పూర్కు చెందిన 25 ఏళ్ల రింకు దాస్గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.