హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వృద్ధులు, ఇతరులు రాసుకొనే వీలునామాల్లో తమ అంతిమ సంస్కారాలను గౌరవంగా జరుపుకొనేందుకు జీఎస్టీని కూడా జమ చేసుకోవాల్సిన దురవస్థ దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై రాజ్యసభలో మంగళవారం చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం వల్ల వ్యవసాయ రంగం కుదేలవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్లలో వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిన మేలు ఏమిటని నిలదీశారు. దేశంలో కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందా? అని ప్రశ్నించారు.
ఉక్రెయిన్ యుద్ధం సాకుతో ధరల పెంపా..?
ధరల పెరుగుదలను అదుపు చేయలేని కేంద్రం తన అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకొనేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతున్నదని సురేశ్రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో వంటనూనెల ధరల పెరుగుదలకు యుద్ధానికి ఏమాత్రం సంబంధంలేదని ఉదహరించారు. 2020లో ఉక్రెయిన్, 2021లో రష్యా దేశాలు వంటనూనెల ఎగుమతులను తగ్గించుకొన్నాయని, 2022లో యుద్ధం మొదలైందని గుర్తుచేశారు. కరోనా ప్రభావాన్ని కేంద్రం సరిగ్గా అంచనావేయలేని అసమర్థత కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విశ్లేషించారు. కేంద్రం తెలంగాణపై కక్షగట్టి అణిచివేయాలని చూసినా తమ రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు విధానాలతో పురోగమిస్తున్నదని సురేశ్రెడ్డి చెప్పారు. 2014 వరకు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ.. నేడు అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్నదని వివరించారు. నదీ జలాల వినియోగంలో ఉన్నతంగా వ్యవహరిస్తూ ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నదని చెప్పారు.