హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలగాణ): తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధాని అయ్యాక 2017లో నేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీని విధించి, దాన్ని ఇప్పుడు 12 శాతానికి పెంచారని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ చేనేతకు ప్రాధాన్యతనిచ్చి ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులందరూ దాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కార్మికులను మరింత నష్టపరిచేలా ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ తీర్మానాన్ని బలపరిచారు. చేనేత వస్ర్తాలపై జీఎస్టీ విధించాలనే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనను ఆయన తీవ్రంగా ఖండించారు.