న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్కు గురువారం లేఖ రాసింది. ‘కొవిడ్-19 టూల్కిట్’ పేరుతో సమాజంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే ‘టూల్కిట్’పై జేపీనడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రతినిధి సంబిత్ పాత్రపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలను వ్యాప్తి చేస్తున్న నలుగురు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కోరుతూ అధికారికంగా ట్విట్టర్కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్ రోహన్ గుప్తా తెలిపారు.
అయితే, కొవిడ్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని, ప్రభుత్వ, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని, దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంసరచనకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఆ మేరకు కొవిడ్-19 సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ ఓ ‘టూల్కిట్’ రూపొందించిందని దాన్ని ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఓ ‘నకిలీ టూల్కిట్’ను సృష్టించిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేతలపై సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది.