హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని శుక్రవారం సందర్శించనున్నారు. రెండు రోజుల కిందట గాంధీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటించాలని సంకల్పించిన సీఎం ఇవాళ వరంగల్కు వెళ్లనున్నారు. సీఎం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ హన్మకొండలోని ద్వారా ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్తారు. అనంతరం 11.45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించనున్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలును సందర్శించి, నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి కెప్టెన్ ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2 గంటలకు ఎంజీఎం దవాఖానకు వెళ్తారు. రోగులతో మాట్లాడడంతో పాటు దవాఖానలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.