న్యూఢిల్లీ, మే 20: కరోనా ఆటకట్టించే ఔషధం తయారీ దిశగా ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. శరీరంలో వైరస్ వృద్ధిని అడ్డుకొనే ఔషధాన్ని ఎలుకల్లో విజయవంతంగా పరీక్షించారు. మనుషుల్లోనూ ఈ ఇంజక్షన్ను రోజుకొకటి చొప్పున ఐదు రోజుల పాటు ఇస్తే వైరస్ కణాలు నశిస్తాయని అంచనా వేశారు.మెంజీస్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో ఆస్ట్రేలియా, ఆమెరికా శాస్త్రవేత్తలు ఈ ఔషధంపై ప్రయోగాలు జరిపారు. సాధారణంగా వైరస్.. మానవ శరీర కణంలోకి ప్రవేశించినప్పుడు ఆ కణం పనితీరును డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఆధారంగా కాపీ చేసుకొని అచ్చం మానవ కణంలాగే పనిచేస్తూ వృద్ధి చెందుతుంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా వైరస్ తన అతిథేయ(హోస్ట్) కణం ఆర్ఎన్ఏను కాపీ చేయకుండా అడ్డుకొనే ఔషధాన్ని అభివృద్ధిచేశారు. ముందుగా ఎలుకలపై ప్రయోగం జరపగా..అది వాటి జీవకణాల్లోకి ప్రవేశించి వైరస్ వృద్ధి చెందకుండా ఈ ఔషధం సమర్థంగా అడ్డుకొన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషులపై ఈ ఔషధ ట్రయల్స్ జరుపడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.