లక్నో : ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ శుక్రవారం సంభాషించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్కు సంబంధిత పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. డీఆర్డీఓ, భారత సైన్యం సంయుక్తంగా ప్రారంభించిన పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్ ఆసుపత్రితో సహా వారణాసిలోని వివిధ కొవిడ్-19 ఆసుపత్రుల్లో సేవలపై ఆరా తీయనున్నారు. జిల్లాలోని నాన్-కొవిడ్ ఆసుపత్రుల పనితీరును కూడా ప్రధాని సమీక్షిస్తారని పీఎంఓ పేర్కొంది.
వర్చువల్ భేటీలో జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లో పరిస్థితుల గురించి ప్రధానికి వైద్యులు వివరించనున్నారు. కొవిడ్ కట్టడికి సలహాలు, సూచనలు ప్రధాని ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 30న గరిష్ఠ స్థాయి నుంచి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 62శాతానికి పైగా తగ్గిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 238 తాజా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 6,725 కరోనా కేసులు రికార్డయ్యాయి.