న్యూఢిల్లీ : పంజాబ్లోని మోగా సమీపంలో గురువారం అర్ధరాత్రి భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో యుద్ద విమానం సాధారణ శిక్షణా దశలో ఉందని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధికారులు తెలిపారు. ఒక్కసారిగా యుద్ధ విమానం నేలకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానం కాలిబూడిదైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మృతి చెందారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం వెనుక గల కారణాలపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది.