రుద్రంపూర్, జూలై 28 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం ఏరియా స్టోర్స్లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత శాలెం రాజుదేనని కొనియాడారు. బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన అందించిన సేవలు విశిష్టమైనవని పేర్కొన్నారు.
రామవరం డిస్పెన్సరీ పునఃప్రారంభానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, రుద్రంపూర్ జయశంకర్ మైదానాన్ని ఆధునిక స్టేడియం తరహాలో అభివృద్ధి చేయడం, ప్రగతి వనం పార్కును కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కొత్తగూడెం ఏరియాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. అండర్ మేనేజర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వంతో జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం యువ అధికారులకు ఆదర్శప్రాయమని వక్తలు పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా షాలెంరాజు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, ఆయన అందించిన సేవలు సింగరేణి అధికారులకు, ఉద్యోగులకు చిరస్మరణీయంగా నిలుస్తాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం గోవిందరావు, ఏరియా ఇంజినీర్ విత్తనాల రామకృష్ణ, వీకే కోల్ మైన్ పీవో ఎం. నరసింహారావు, ఏరియా స్టోర్స్ హెచ్వోడీ మైనేని శ్రీనివాసరావు, స్టార్ ఇంజినీర్ భాస్కర వెంకట రమణ, మేనేజర్ మురళి, సేఫ్టీ ఆఫీసర్ అనిల్, వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ (కమల్), ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి నటరాజ్, నాయకులు సాంబమూర్తి, అవినాష్, నరేందర్, నాగేశ్వరరావు, నరేష్, సురేష్, సాగర్, గావిని నాగరాజు, లకవత్ వెంకటేశ్వర్లు, రాజేష్, సుబ్రమణ్యం, మెయిన్, లికిత్, గంగాధర్, సామల నరేందర్, ఉద్యోగులు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.