న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: విదేశీ విద్యార్థులకు అమెరికా ఉద్యోగాలు ఇక మరింత క్లిష్టం కానున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యాక అమెరికాలో పనిచేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ప్రతిపాదిత మార్పు ప్రకారం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కార్యక్రమం ద్వారా పని అనుమతిని కోరే విదేశీ పట్టభద్రులు 1,00,000 డాలర్లు(సుమారు రూ.96 లక్షలు) రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. వైట్ హౌస్ నుంచి ఈ ప్రతిపాదనకు అనుమతి లభించినప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నిబంధనను అమలు చేసే ముందు ప్రజల పరిశీలన కోసం దీనిని ప్రచురిస్తారు. తద్వారా వ్యక్తులు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను సమర్పించే అవకాశం లభిస్తుంది.
ఓపీటీ అంటే ఏమిటి?
అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలను పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులు ఆ దేశంలో పనిచేయడానికి ఓపీటీ అనుమతి ఇస్తుంది. ఈ కార్యక్రమం కింద విద్యార్థులు సాధారణంగా 12 నెలల పని అనుమతిని పొందుతారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాలలో పట్టభద్రులైన విద్యార్థులు అదనంగా 24 నెలల పొడిగింపును పొందవచ్చు. దీనివల్ల అర్హులైన విద్యార్థులు ఓపీటీ కింద గరిష్ఠంగా 36 నెలల పాటు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఓపీటీ పూర్తయిన తర్వాత కొంతమంది విద్యార్థులు అమెరికాలో తమ ఉద్యోగాన్ని కొనసాగించడానికి ఇతర వర్క్ వీసా మార్గాలను అన్వేషిస్తారు.
ప్రస్తుత ఓపీటీ ఫీజు
ప్రస్తుతం ఓపీటీ కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే రుసుము సుమారు రూ. 40,000గా ఉంది. ప్రతిపాదిత రూ.96 లక్షల రుసుము అనేది పని అనుమతిని పొందడానికి అయ్యే ఖర్చులో భారీ పెరుగుదలను సూచిస్తుంది. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పటికే భరిస్తున్న ట్యూషన్ ఫీజు, వసతి, ఆహారం, ఇతర ఖర్చులకు అదనంగా ఈ ప్రతిపాదిత రుసుము ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఓపీటీ కింద 2 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు పనిచేస్తున్నారు. తద్వారా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే అతిపెద్ద సమూహంగా ఉన్నారు. ప్రతిపాదిత రుసుమును అమలు చేసిన పక్షంలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం అమెరికాలోనే ఉండిపోవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులు భారీస్థాయిలో అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
10 లక్షల మంది విదేశీ విద్యార్థులు
అమెరికాలో ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 3.63 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో చాలా మందికి ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత పని చేసే అవకాశం అనేది ఒక ముఖ్యమైన అంశం. ఓపీటీ ఖర్చులో భారీ పెరుగుదల కారణంగా కొందరు విద్యార్థులు జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లకు చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి.