హనుమకొండ, మే 6: మనువాద బీజేపీ, కపటప్రేమ కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇల్లందుల రాజేశ్ఖన్నా అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు మాత్రమే తెలంగాణ అభివృద్ధి, పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నదని చెప్పారు. 125 అడుగుల అంబేదర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నంతోపాటు పాడిపంటలతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ అభివృద్ధి చిహ్నాలని గుర్తుచేశారు. అట్లాంటి తెలంగాణ 5 నెలల కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక నిమిషం కూడా కరెంటు పోని రాష్ట్రాన్ని కరెంటు కోతల రాష్ట్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో అఖిలపక్షాన్ని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో పాటు బిల్లు పెట్టాలని ప్రధాన మంత్రి వద్దకు బృందాన్ని పంపినట్తు గుర్తుచేశారు. కేసీఆర్తోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్జి ఈదునూరి యాకన్న, యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెడ స్వామి, రాష్ట్ర నాయకుడు బొచ్చు మురళి, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా, కేయూ ఇన్చార్జి ధర్మారపు శ్రీకాంత్ పాల్గొన్నారు.