KCR : తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదని ఎద్దేవా చేశారు. ఏరికోరి మొగణ్ణి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టుగా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నడని విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు సరఫరా సరిగా లేదని, సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, మంచి నీళ్లకు కూడా కరువొచ్చిందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు.
‘ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదు. మొన్న ఎక్కడనో మాట్లాడుతూ కృష్ణా నదిని నేనే కట్టిన అన్నడు. ఎవడన్నా నది కడుతడా ప్రపంచంలో. నదిని కట్టిన అంటే భయంకరంగా ట్రోలింగ్ చేసిన్రు సోషల్ మీడియాలో. ఎనకటికి ఒగామె ఏరికోరి మొగణ్ణి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట. మనం ఇయ్యాల వాళ్ల అడ్డగోలు హామీలకు మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెళ్లకే ఆగమాగం చేసిన్రు. ఏం జబ్బొచ్చింది తెలంగాణకు..? కరెంటు ఎక్కడ పోయింది..? సాగునీళ్లు ఎక్కడ పోయినయ్..? పంటలు ఎందుకు ఎండుతున్నయ్..? మంచి నీళ్లకు కరువెందుకు వస్తున్నది..? గత పదేళ్లలో ఇవన్నీ ఉండెనా..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ రోజు మనం లక్ష కళ్యాణలక్ష్మి ఇస్తే.. వీళ్లు దానికి తులం బంగారం కలిపి ఇస్తం అన్నరు. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా..? రైతుబంధు అందరికి వచ్చిందా..? ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తం అన్నరు. ఎవరికన్న వచ్చినయా..? అనాడు రెండు దఫాలుగా మేం లక్ష రూపాయల చొప్పున రుణ మాఫీ చేసినం. పదవిలోకి రాంగనే ముఖ్యమంత్రి ఓ మాట చెప్పిండు. కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండుగా ఇగ మేం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తం అన్నడు. డిసెంబర్ 9న ఉదయం పదిన్నర గంటలకే మాఫీ అన్నడు. అయ్యిందా..? ఎక్కడ కూడా రుణమాఫీ కాలే’ అని కేసీఆర్ అన్నారు.