సిద్దిపేట, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాను సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు జిల్లాలుగా విభజించి కేసీఆర్ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువచ్చారు. దీంతో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. దూరభారం తగ్గింది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిపి వేస్తానన్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ఒక్కొక్కటిగా చెరిపివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇటీవ ల ఆయన మాటల్లోనే ఈ విష యం స్పష్టంగా బయటపడింది. జిల్లాల రద్దు, పునర్వ్యవస్థీకరణపై కార్యాచరణ మొదలు పెట్టినట్లు సమాచారం.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే రెండు జిల్లాలు రద్దయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జిల్లాల రద్దుకు రేవంత్ సర్కార్ పూనుకుంటే అందుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రతి 50 కి.మీటర్ల విస్తీర్ణంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజల ముందుకు పాలన తెచ్చారు. నూతన జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీస్ కమిషనరేట్ భవనాల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసింది. చిన్న జిల్లాలను గణనీయ అభివృద్ధిని చేసి చూపించారు. రిజర్వాయర్ల నిర్మాణం చేసుకున్నాం. మండల కేంద్రాలకు చక్కటి రహదారుల నిర్మాణాలు జరిగాయి. చిన్న జిల్లాలు ఒక జిల్లాతో మరో జిల్లా పోటీపడి అభివృద్ధి సాధించాయి. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేస్తే మళ్లీ సమైక్య పాలన గుర్తుకు వచ్చే అవకాశం లేకపోలేదు. అభివృద్ధి కుంటుపడుతుందని మేధావులు చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాను సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాను అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, హరీశ్రావుతో కలిసి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టింది. రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాలుగా రూపుదిద్దుకున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఆ జిల్లా కేంద్రాలకు ఎటు చూసినా 40 నుంచి 50 కి.మీ దూరంలోపల జిల్లా విస్తరించి ఉంది. దీంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాలన సులభమైంది. ప్రజల వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు తరుచూ వెళ్లిరావడంతో పాలన ప్రజల వద్దకే చేరింది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చిన్న జిల్లాలతోనే సాధ్యమైంది. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలకు చేరువైన విధానం ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు మారుమూల పల్లె, మండల కేంద్రానికి జిల్లా కేంద్రం నుంచి అధికార యంత్రాంగం వెళ్లేది కాదు. జిల్లాలు ఏర్పాటయ్యాక జిల్లా కేంద్రం నుంచి 45 నిమిషాల్లో మారుమూల పల్లెకు వెళ్లి వస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. జిల్లా కేంద్రం దూరభారం తగ్గడంతో ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకొని తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించుకుంటున్నారు.
రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో నూతన సమీకృత కలెక్టరేట్లు నిర్మించి అన్ని వసతులతో పాలన కొనసాగుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాలు, పోలీస్ కమిషనరేట్ భవనాలు ఏం చేస్తారనే ప్రశ్న ప్రజల్లో చర్చ జరుగుతున్నది. జిల్లాల రద్దు వల్ల ఇందులో పనిచేసే ఎంతోమంది ఉద్యోగాలు పోతాయి. జిల్లా స్థాయి అధికారుల పోస్టులు సైతం పోనున్నాయి. ఇన్ని రోజులు హెచ్వోడీలుగా పని చేసిన వారంతా మళ్లీ కింది స్థాయి ఉద్యోగులుగా పనిచేయాల్సి వస్తుంది. కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో నిరుద్యోగులకు ఉపాధి లభించింది. ఇప్పుడు జిల్లాలు రద్దు చేస్తే వీరంతా రోడ్డున పడాల్సి వస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు మళ్లీ పుట్టుకొస్తాయి. నూతన మండలాలు, నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావడంతో పట్టణాలు, మండల కేంద్రాలు బాగా అభివృద్ధి చెందాయి. వివిధ వర్గాల వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. సక్రమంగా అధికారుల పర్యవేక్షణ ఉండడంతో పాలన బాగా జరిగింది. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య. జిల్లాను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు. జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడం వల్ల ప్రభుత్వ పనులు త్వరగా పూర్తవుతున్నాయి. సిద్దిపేట జిల్లా వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతమేలు జరిగింది. అలాంటప్పుడు జిల్లాను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది. ఇలాంటి నిర్ణయాలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. రాజకీయాల కోసం ఇటువంటి చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.
జిల్లాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడాన్ని విరమించుకోవాలి. గత ప్రభుత్వం పాలనా సౌలభం కోసం జిల్లాలను ఏర్పాటు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే చాలా బాగుంది. రేవంత్రెడ్డి ప్రభుత్వం 33 జిల్లాలను తగ్గిస్తామనడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఉన్న సిద్దిపేట జిల్లాతో ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు జిల్లా కేంద్రంలోని అధికారులను కలిసే అవకాశం ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో జిల్లా అధికారులు జిల్లా అంతటా తిరిగేందుకు వీలుంది. అలాంటి మంచి అవకాశాలు ఉన్న చిన్న జిల్లాలను రదు ్దచేస్తామనడాన్ని విరమించుకోవాలి. జిల్లాలను రద్దు చేస్తే మరోసారి ఉద్యమించేందుకు అన్ని వర్గాల ఉద్యోగ, ఉపాధ్యాయులు, అధికారులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారు.