చండీగఢ్, మే 8: లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. సీఎం నాయబ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మైనార్టీలో పడిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాజీ మిత్రపక్షం జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ) బుధవారం కీలక ప్రతిపాదన చేసింది.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు కాంగ్రెస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం తీసుకొస్తే, బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా హిస్సార్లో మాట్లాడుతూ పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం నాయబ్ సింగ్ అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ సీఎం ఖట్టర్ పేర్కొనడం గమనార్హం.