Boxing | అస్తానా: ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా (కజకిస్తాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్స్లో జాదుమణి సింగ్, నిఖిల్, అజయ్ కుమార్, అంకుశ్ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరారు.
జాదుమణి (51 కిలోలు) 5-0 తేడాతో భూటాన్ బాక్సర్ ఫుంట్షోను ఓడించగా 57 కిలోల విభాగంలో నిఖిల్ 4-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు అయుబ్ఖోన్ను మట్టికరిపించాడు. అజయ్ (63.5 కిలోలు), అంకుశ్ (71 కిలోలు) రిఫరీ స్టాప్ ది కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) నిర్ణయంతో సెమీస్ చేరారు. ఈ టోర్నీలో ఇప్పటికే 22 మంది బాక్సర్లు సెమీస్ చేరారు. ఇందులో పది మంది పురుషులు కాగా 12 మంది మహిళా బాక్సర్లున్నారు.