భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎండ దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు నమోదైంది. ఇప్పటికే ఎండవేడిమికి ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో పిట్టల్లా రాలగా శుక్రవారం ఒక్క వరంగల్ జిల్లాలోనే ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు. మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే గొడుగుతో బయటకు రావాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.