సిద్దిపేట : కొడుకులు పున్నాగ నరకం నుంచి తప్పిస్తారని ఆశపడిన ఆ తండ్రికి కష్టాలే ఎదురయ్యాయి. కష్ట, నష్టాలకు ఓర్చి కొడుకులను పెంచి పెద్ద చేస్తే పట్టించుకోవడం లేదని ఓ తండ్రి ఆవేదన చెందాడు. తన యావదాస్తిని(Property) దేవుడి పేర రాసేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దపేట(Siddipet) జిల్లా చిన్న కోడూరు మండలం అలీపూర్కు చెందిన బాలయ్య(Balaiah) తన కొడుకులు అన్నం పెట్టట్లేదని, సరిగా చూసుకోవట్లేదని మనస్థాపానికి గురయ్యాడు.
తన యావదాస్తిని కొండగట్టు అంజన్నకు(Kondagattu Anjana) సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం కొండగట్టుకు చేరుకుని అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన తన ఆస్తికి సంబంధించిన పత్రాలను కొండగట్టు దేవస్థానంలోని హుండీలో వేసేలా నిర్ణయం తీసుకున్నారు.
ఆస్తి పత్రాలు హుండీలో వేస్తే చెల్లదని పూజారులు చెప్పడంతో చివరి నిమిషంలో తన ఆలోచన మార్చుకున్నాడు. ఆస్తిని కొండగట్టు అంజన్న పేరుతో పట్టా చేస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కోరారు. అందుకు అధికారులు సరేననడంతో బాలయ్య వెనుదిరిగాడు.