శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి. ఈ సందర్భంగా ఏకే-47 రైఫిల్తో సహా ఐదు తుపాకీలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తానమండిలోని అజ్మతాబాద్ ప్రాంతంలోని ఎగువ ప్రాంతాలలో అనుమానాస్పద కదలికలపై అందిన సమాచారం మేరకు సైన్యం, పోలీసులు మన్యాల్, దన్నా, కొప్రాలో సంయుక్త కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ సమయంలో మన్యాల్లో ఒక రహస్య స్థావరాన్ని గుర్తించారు. ఎనిమిది మ్యాగజైన్లు, 105 రౌండ్లతో నాలుగు పిస్టల్స్, రెండు మ్యాగజైన్లతో కూడిన ఏకే రైఫిల్, 54 రౌండ్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ తాడును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు తానమండి పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.