న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రైతులతో సమావేశం కానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగుతుందని పీఎంఓ తెలిపింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో చర్చించనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని ఇథనాల్ బ్లెండింగ్ రోడ్ మ్యాప్పై నిపుణుల కమిటీ నివేదిక విడుదల చేయనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ ఈ-20 నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా పూణేలో పైలట్ ప్రాజెక్టును సైతం ప్రధాని ప్రారంభించనున్నారు.