UP Polls : బీజేపీ 91 మంది అభ్యర్థులతో యూపీలో మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం 294 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లైంది బీజేపీ. అయితే ఈ మొత్తం తంతగాన్ని చూస్తే ఒక్కటి స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్న అంశం ద్యోతకమవుతోంది. అంతేకాకుండా మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎఫెక్ట్ కూడా అభ్యర్థుల ఎంపికలో స్పష్టంగా కనిపిస్తోంది. స్వామి ప్రసాద్తో సహా మరికొంత మంది బీజేపీని వీడిన నేపథ్యంలో బీజేపీ మరింత జాగ్రత్త పడింది. పాత మంత్రులందరిపై భరోసా ఉంచింది. తిరిగి వారందరికీ టిక్కెట్లిచ్చింది. ఎమ్మెల్యేల విషయంలోనూ బీజేపీ ఇదే విధానాన్ని అనుసరించింది. సిట్టింగ్లకే తిరిగి టిక్కెట్లిచ్చింది. అక్కడక్కడా కొద్ది మందిని మాత్రం మార్చింది కానీ, సిట్టింగ్లకే పెద్ద పీట వేసింది.
అయితే కొత్త వారిలో మాత్రం సీఎం యోగి మీడియా సలహాదారు శలభ్మణి త్రిపాఠీకి ఈసారి టిక్కెట్ ఇచ్చారు. దేవరియా అన్న నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. అయితే లక్నో, వారణాసి అభ్యర్థుల పేర్లను మాత్రం బీజేపీ ఇంకా పెండింగ్లోనే వుంచింది. అత్యంత కీలకమైన అయోధ్య నుంచి వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ బరిలోకి దింపింది. ఇక మంత్రుల జాబితాలను పరిశీలిస్తే సిద్ధార్థ్ నాథ్ సింగ్, నంద కుమార్ నంది, సతీశ్ చంద్ర ద్వివేదీకి టిక్కెట్ లభించింది. సూర్య ప్రతాప్ సాహీ, ఉపేంద్ర తివారీ, గిరీశ్ చంద్ర యాదవ్, సురేశ్ పాసీ, రాజేంద్ర ప్రతాప్ సింగ్, అనుపమ జైస్వాల్, రమాపతి శాస్త్రి,జయ ప్రతాప్ సింగ్, జయప్రకాశ్ నిషాద్కు మళ్లీ టిక్కెట్ ఇచ్చింది బీజేపీ.
సీఎం యోగి మీడియా సలహాదారుగా వున్న శలభ్మణి త్రిపాఠీకి ఈసారి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దేవరియా నుంచి బరిలోకి దిగాలని ఆదేశించింది. ఈయన పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2016 లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత యూపీ సంఘటనా కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సీఎం యోగి మీడియా సలహాదారుగా వెళ్లారు.