Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ 75,11.39 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 188.50 పాయింట్ల నష్టంతో 74,482.35 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 22,783.35 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, 38.55 పాయింట్ల నష్టంతో 22,603.85 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంకు భారీగా లబ్ధి పొందగా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ భారీ నష్టాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ ప్రధానంగా లబ్ధి పొందగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా తదితర స్టాక్స్ నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.07 శాతం లబ్ధి పొందగా, స్మాల్ క్యాప్ 0.04 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.82 శాతానికి పైగా లాభ పడితే, నిఫ్టీ రియాల్టీ 1.45 శాతం పుంజుకున్నాయి.