– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, సెప్టెంబర్ 16 : సిరుల మాగాని సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. కార్మికులకు మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలు, సొంతింటి కల, మెరుగైన వైద్య సదుపాయం వంటి సేవలను అందించారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను అరిగోశ పెడుతున్నాడని విమర్శించారు. నేటి వరకు కార్మికులకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు అనేక రకాల జబ్బులతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు కూసన వీరభద్రం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, మంతపురి రాజు గౌడ్, తొగురు రాజశేఖర్, సంకుబాన అనుదీప్, రాజేష్ రతన్ పాల్గొన్నారు.