Sharad Pawar : అధికార బీజేపీ నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుణె సిటీలోని సస్వాద్ తహసీల్లో పవార్ ప్రసంగించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎన్నికల కంటే భిన్నంగా ఉన్నాయని, ఏ విధానంలో దేశం పనిచేస్తోందో తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ని కటకటాల వెనక్కి నెట్టారు. వారు (బీజేపీ) నియంతృత్వ మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం వారిని ఓడించాలి’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. ఎన్సీపీ (ఎస్సీపీ) అభ్యర్థిని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఎన్సీపీ (ఎస్సీపీ) సిట్టింగ్ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేను మరోసారి బారామతి అభ్యర్థిగా శరద్పవార్ ప్రకటించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య, తన వదిన సునేత్రా పవార్తో సుప్రియ పోటీ పడుతున్నారు. సుప్రియా సూలేకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని శరద్పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పారు.