లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలి
వసతుల ఏర్పాట్లపై దృష్టిపెట్టండి డెయిరీ యూనిట్ల షెడ్లు వెంటనే నిర్మించాలి
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో దళితబందు పథకం పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంఫీడీవోలు యూనిట్ వారిగా ఎప్పటికప్పుడు సమీక్షించి లబ్ధిదారులకు దిశా నిర్దేశం చేయాలన్నారు. డెయిరీ, పౌల్ట్రీ వంటి యూనిట్ల గ్రౌండింగ్కు అవసరమైన అన్ని వసతుల ఏర్పాట్లలో జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు హితవు చేశారు. బోర్ వేసిన తరువాత లబ్ధిదారులకు నచ్చిన మోటార్లు తెచ్చుకునే విధంగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆయా గ్రామాలకు వెళ్లి యూనిట్ల గ్రౌండింగ్కు అవసరమైన ఏర్పాట్లతో పాటు యూనిట్కు అవసరమైన సౌకర్యాలు పరిశీలించాలన్నారు. గేదెలకు సంబంధించిన యూనిట్లలో షెడ్లు పూర్తి కావాలన్నారు. నిర్ణీత సమయంలోగా పూర్తి చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దళితబంధు అమలులో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.