న్యూఢిల్లీ : వాహనదారులకు చమురు కంపెనీలు మళ్లీ షాక్ ఇచ్చాయి. వరుసగా రెండో రోజు బుధవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. గత కొద్ది రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన దేశీయ ఇంధన ధరలు మళ్లీ మంగళవారం స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలు, విదేశీ మారకపు రేట్లకు అనుగుణంగా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 19 పైసలు, డీజిల్పై లీటర్కు 21 పైసలు పెంచారు. పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.74, డీజిల్ లీటర్ రూ.81.12కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్కు రూ.97.12, డీజిల్ రూ.88.19, చెన్నైలో పెట్రోల్ రూ.92.70, డీజిల్ రూ.86.09, కోల్కతాలో పెట్రోల్ రూ.90.92, డీజిల్ రూ.83.98కు చేరాయి.
గతేడాది మార్చిలో కేంద్రం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై రూ.21, డీజిల్ రూ.19పైగా పెరిగాయి. ఇంతకు ముందు ఏప్రిల్ 15న పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయ. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 దాటింది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో పెట్రోల్ రూ.101 దాటింది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్, రేవా, చింద్వారాలో రూ.100 దాటింది. గత కొంతకాలంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం ఊపిరిపీల్చుకున్న వాహనదారులు మళ్లీ వరుసగా పెరుగుతూ వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.