హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిపోయిన వారి నుంచి సేకరించిన ప్లాస్మాతో మరింత మంది రోగులను కాపాడే పద్ధతి.. ప్లాస్మా థెరపీ. వ్యాధి తీవ్రతను తగ్గించటమే కాకుండా త్వరగా కొలుకొనేందుకు దోహదం చేస్తుందీ చికిత్స. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఎక్కువమందిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు రికవరీ అయినవాళ్లు ప్లాస్మా దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీన్నిబట్టే ప్లాస్మా థెరపీకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ప్లాస్మా డోనర్ల వెతుకులాట ఎక్కువైంది. సోషల్ మీడియా వేదికగా దాతల కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్లాస్మా థెరపీలో భాగంగా కరోనా రికవరీ అయినవారి రక్తం నుంచి పసుపు వర్ణంలో ఉండే ప్లాస్మాను సేకరించి వైరస్ సోకిన మరోవ్యక్తికి ఎక్కిస్తారు. రికవరీ అయినవారి శరీరంలో యాంటిబాడీలు అభివృద్ధి అయి ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కించిన వ్యక్తిలో కూడా యాంటిబాడీలు అభివృద్ధి చెందుతాయని వైద్యశాస్త్రం చెప్తున్నది. ఫలితంగా వ్యాధి తీవ్రత తగ్గి రోగి ప్రాణం పోకుండా కాపాడుకొనే వీలు కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. ప్లాస్మా థెరపీ.. లైఫ్ సేవింగ్ థెరపీ అని ఢిల్లీలోని హెచ్సీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్కు చెందిన పల్మనాలజిస్టు డాక్టర్ దేవేంద్ కుంద్రా తెలిపారు. ప్లాస్మా థెరపీ ఏ మేరకు ప్రభావవంతంగా ఉంటుందనేదానికి పెద్దగా ఆధారాలు లేవని, అయితే ఈ ప్రక్రియ అనేక దేశాల్లో కొనసాగుతున్నదని వెల్లడించారు.
కరోనా నుంచి రికవరీ అయినవారు 28-30 రోజుల తర్వాత ప్లాస్మా డొనేట్ చేయవచ్చు.
బరువు 50కిలోలు, అంతకన్నా ఎక్కువ ఉండాలి.
ఇన్ఫెక్షన్ సందర్భంగా జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు అధికంగా ఉండి, వాటినుంచి కోలుకున్నవారి నుంచే ప్లాస్మా సేకరిస్తారు.