హైదరాబాద్, మే 4, (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి మృతదేహాల దహనానికి కట్టెలు కూడా కరువయ్యాయి. సాధారణ మరణాలకు తోడు కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్మశానాల్లో కలప కొరత ఏర్పడింది. దాంతో ఈ సమస్యను అధిగమించేందుకు తమవంతుగా సహాయం అందించాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) నిర్ణయించింది. సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరాచేస్తామని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు. ఫారెస్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏటా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపడుతారు. ఈ కలపను కార్పొరేషన్ నుంచి పేపర్ మిల్లులు సేకరిస్తాయి. అమ్మగా మిగిలిన సుమారు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్తోపాటు సమీప మున్సిపాలిటీల స్మశానాలకు అంత్యక్రియల కోసం సరఫరా చేస్తామని ప్రతాప్రెడ్డి వెల్లడించారు. ఈ కలప విలువ రూ.20 లక్షలు ఉంటుందని చెప్పారు.
మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకొంటూ కలపను సరఫరా చేస్తామని కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ జీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. రంగారెడ్డి డివిజన్లో 3,500 టన్నులు, ఖమ్మం-సత్తుపల్లి- అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్లలో 4,000 టన్నులు, మంచిర్యాల-కాగజ్నగర్లో 860 టన్నులు, వరంగల్ డివిజన్లో 200 టన్నుల కలప అందుబాటులో ఉందని వెల్లడించారు. అంత్యక్రియలకు అవసరమైన వెదరును కూడా సరఫరా చేస్తామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో అంబర్పేట, బన్సీలాల్పేట, ఆసిఫ్నగర్, ఈఎస్ఐ స్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామని చెప్పారు. అంత్యక్రియలకు కలప దొరకని పేదలు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. కలపను తరలించేందుకు స్థానిక లారీఓనర్స్ అసోసియేషన్లు కూడా ముందుకు వచ్చాయని చంద్రశేఖర్రెడ్డి వివరించారు.