టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20ల్లో సత్తాచాటిన జడ్డూ.. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. భారత బ్యాటింగ్లో అతని ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాపార్డర్ నిలకడగా నిలబడలేకపోవడంతో తొలి రోజే బ్యాటింగ్కు వచ్చిన జడ్డూ.. పంత్ (96)తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఒక పక్క పంత్ రెచ్చిపోతుంటే తను మరో ఎండ్లో నిలబడి అతన్ని ప్రోత్సహించాడు. రెండో రోజు అతని ఆట మ్యాచ్కే హైలైట్. అశ్విన్ (61)తో కలిసి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అద్భుతమైన కమాండ్తో మైదానం నలుమూలలా బంతిని బౌండరీ దాటిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ అవుటైన తర్వాత మహమ్మద్ షమీతో కలిసి మరో 103 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. సెంచరీ పూర్తయిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నా.. 175 పరుగులతో ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత బంతితో కూడా చెలరేగి అదే ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాతి ఇన్నింగ్స్లో కూడా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకొని లంకేయులకు ముచ్చెమటలు పట్టించాడు.
ఇలా ఒక టెస్టు ఇన్నింగ్సులో సెంచరీ చేసి, ఐదు వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల లిస్టులో చేరాడు. ఇప్పటి వరకు కేవలం మరో ఇద్దరు భారతీయులు వినూ మాకడ్ (1952లో ఇంగ్లండ్పై 184 రన్స్, 5/196), పాలీ ఉమ్రిగర్ (1962లో వెస్టిండీస్పై 172 నాటౌట్, 5/107) మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో ఒక వార్తాసంస్థకు జడేజా ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మీ కల ఏంటి? అని జడ్డూని అడిగితే.. ‘‘ఒకే మ్యాచ్లో సెంచరీ చేసి, ఐదు వికెట్లు తీసుకోవాలి’’ అని చెప్పాడు.