Harish Rao | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్రెడ్డి గారూ! అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చేశా. ఇదిగో నా రాజీనామా లేఖ. నువ్వెక్కడ? ఎందుకు వెనకడుగు వేస్తున్నవ్? రాజీనామాకు ముందుకు రావటం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నట్టే’ అని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరించిన హరీశ్రావు.. శుక్రవారం హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి తన రాజీనామా పత్రాన్ని ఉద్యమ జర్నలిస్టుల చేతుల్లో పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణలోని నా అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్, నా నిరుద్యోగ సోదరులకు రూ.4 వేల భృతి, మా రైతన్నలకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్, మా ఆడబిడ్డలకు రూ.2,500 ఆగస్టు 15లోపు అమలు చేయండి. ఇవేమీ నేను కొత్తగా అడుగుతున్నవి, మా గొంతెమ్మ కోర్కెలేమీ కావు. ఎన్నికల్లో మీరు బాండు పేపర్లపై రాసిచ్చిన హామీలు. వీటన్నింటినీ నెరవేర్చి నా రాజీనామాను ఆమోదించుకోండి. లేకపోతే మీరూ రాజీనామా చేయండి’ అని సీఎం రేవంత్కు ఓపెన్ చాలెంజ్ చేశారు. రేవంత్ చివరికి దేవుళ్లను కూడా వదలకుండా ప్రమాణాలు చేస్తూ.. రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేది నిజమే అయితే గన్పార్క్ దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు. ‘ఇక్కడ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావులు లేదా జర్నలిస్టుల చేతుల్లో ఇరువురి రాజీనామాలు పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ, వందరోజుల్లో అమలు చేస్తామని బాండుపేపర్లపై రాసిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేస్తే.. నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్కు ఇవ్వండి. నేను మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. ఇదే విషయం స్పష్టంగా చెప్పాను. ఒక వేళ ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్కు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని సూటిగా ప్రశ్నించారు.
దేవుళ్లపై ప్రమాణం చేసి, ఒట్లు పెట్టుకొని, బాండ్లుపేపర్లపై రాసిచ్చిన హామీలు నిజమే అయితే.. రాజీనామా చేయడానికి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అని హరీశ్రావు ప్రశ్నించారు. రాజీనామాకు ముందుకు రావటం లేదంటే.. ప్రజలను మరొక్కసారి మోసం చేస్తున్నట్టేనని తెలిపారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ఏనాడూ అమరవీరుల స్థూపం వద్దకు రాలేదని గుర్తుచేశారు. ‘ఇక్కడకొచ్చి రెండు పూలు పెట్టింది లేదు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది మా దురదృష్టం. మీరు గన్పార్క్కు రావడం, రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే, అమరుల స్థూపం వద్దకు పూలు సమర్పించాల్సి వస్తుందేమోనన్న భేషజాలు ఉంటే.. కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రాజీనామా పత్రం ఇక్కడ పెట్టండి. నేను ఇక్కడుండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖను ఇచ్చి వెళ్తున్నా.. మా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు, మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ల చేతుల్లోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్ అన్ని హామీలు అమలు చేస్తే వారు నేరుగా నా రాజీనామాను స్పీకర్కు ఇవ్వొచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలాగే లెటర్ పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెడతది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే మీరు దేవుళ్ల పేరు మీద ప్రజలను మోసం చేస్తారని భావించాల్సి వస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మా ఆశ, మా ప్రయత్నం రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించటమే. అదే మా కర్తవ్యం. నేను రాజకీయాలకు అతీతంగా, స్వచ్ఛదంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మాట్లో కూడా రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని వెల్లడించారు. తమకు రాజకీయాలకంటే, ఎమ్మెల్యే పదవి కంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత తమదని, నాడు స్వయంగా సోనియాగాంధీ లేఖ రాశారని గుర్తుచేశారు. డిసెంబర్ 9న తొలి సంతకం ఆరు గ్యారెంటీల మీద పెడతామని, రుణమాఫీపై పెడతామని చెప్పి మాట తప్పినందుకు రేవంత్రెడ్డి ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఆగస్టు 15లోగానైగా అన్ని హామీలు నెరవేస్తే సంతోషమేనని తెలిపారు.
చెప్పినమాట ప్రకారం మాజీ మంత్రి హరీశ్రావు రాజీనామా లేఖ తీసుకొని వచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సీఎంకు ధైర్యం ఉంటే హరీశ్ రాజీనామా సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాకపోయినా సీఎం రేవంత్కు తీరిక ఉన్నప్పుడు గన్పార్క్కు వచ్చి సవాల్ స్వీకరించాలని అన్నారు. ఓట్ల కోసం లేనిపోని హామీలు ఇస్తామంటే కుదరదని, డిసెంబర్ 9న ఇస్తామన్న రుణమాఫీ ఏమైంది? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి దంపతులు, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా హరీశ్రావుకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు గన్పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపగా.. పోలీసులు రోప్ పార్టీతో వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు అమరులకు నివాళి అర్పించారు.
గౌరవనీయులైన తెలంగాణ శాసన సభాపతి గారికి..
విషయము : శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీతో పాటు ఆరు గ్యారంటీల్లోని మొత్తం పదమూడు హామీలు సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టు ఆగస్టు 15న అమలు చేస్తే, నేను నా శాసనసభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్టు పరిగణించి ఆమోదం తెలపాలని కోరటం గురించి..
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవికాకుండా 2023 డిసెంబర్ 9 నాడు రైతులకు ఉన్న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట ప్రతి నెలా 18 ఏండ్లు దాటిన వారందరికీ రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీ నేరవేరలేదు. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున, రైతు కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున చెల్లించటం, పంటలకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించటం అనే హామీలు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వటం ఆచరణకు నోచుకోలేదు. యువ వికాసం కింద 5 లక్షల రూపాయల విలువైన విద్యాభరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ సూల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. చేయూత కింద ఇచ్చిన హామీ అయిన ఆసరా పెన్షన్లను 2 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలకు పెంచటం కూడా అమలు కాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ హామీని ఆగస్టు 15లోపు అమలు చేస్తానని దేవుడిపై ఒట్లు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ హామీతో పాటు వందరోజుల్లో పూర్తి చేస్తామని చేయలేని గ్యారంటీలను కూడా ఆ రోజులోగా నెరవేర్చాలని డిమాండ్ చేశాను. ఆగస్టు 15లోగా నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేయాలని నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాను. నా సవాల్కు కట్టుబడి నేను ఈ రాజీనామా ప్రతిపాదన లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 2024 ఆగస్టు 15లోగా పైన పేరొన్న హామీలన్నింటినీ అమలుచేసిన పక్షంలో ఈ లేఖను నా రాజీనామాగా పరిగణించి ఆమోదించాలని కోరుతున్నాను.
ఇట్లు…
తన్నీరు హరీశ్రావు,శాసనసభ్యుడు, సిద్దిపేట