తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. జూలై నెలకు సంబంధించిన స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంగళవారం టీటీడీ విడుదల చేసింది. రోజుకు ఐదువేల టికెట్ల వంతున జూలై నెల కోటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.300 దర్శనం టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం కోరింది. దర్శన సమయంలో భక్తులు కచ్చితంగా మాస్క్లు ధరించడంతో పాటు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.