న్యూఢిల్లీ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మరో నలుగురు ప్రయాణిస్తున్న చిన్న విమానం ప్రమాదానికి గురి కావడంతో అందరూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ )కేంద్ర, రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు (వీవీఐపీలు) ప్రయాణించే ప్రత్యేక, నాన్ షెడ్యూల్ విమానాలకు సంబంధించి శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ‘భద్రతపై ప్రభావం చూపే విధంగా ప్రయాణం చేపట్టేందుకు విమాన సిబ్బందిపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాకూడదు. వీఐపీల అవసరాల కారణంగా విమాన ప్రయాణంలో చివరి నిమిషంలో చేసే మార్పులు ఏమైనా ఉంటే అవి సంస్థ యాజమాన్యం ద్వారా మాత్రమే సమన్వయం చేసుకోవాలి తప్ప సిబ్బందితో నేరుగా కాదు’ అని కొత్త నిబంధనలు పేర్కొన్నాయి.
ఈ కొత్త నిబంధనలు వీఐపీలు ఇష్టానుసారంగా ఇచ్చే ఆదేశాలకు ‘నో’ చెప్పడానికి వీలు కల్పిస్తున్నాయని ఒక చార్టర్ ఆపరేటర్ తెలిపారు. వాతావరణం, ఇతర సమస్యల కారణంగా విమానం బయలుదేరడం సాధ్యం కాదని చెప్పినా, వీఐపీల బలవంతం కారణంగా వెళ్లి ఇబ్బందులు, ప్రమాదాల్లో పడిన ఘటనలు తాను ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. ఈ కొత్త నియమావళి ఆ ఇబ్బందులను అధిగమిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, జడ్ ప్లస్, ఎస్పీజీ కింద రక్షణ పొందుతున్న వారు, సీజేఐ, సీఎంలు, గవర్నర్లు తదితరులు వీవీఐపీ క్యాటగిరీకి వస్తారు.