భువనేశ్వర్ : ఓ గర్భిణి పట్ల మహిళా ఎస్ఐ అమానవీయంగా ప్రవర్తించింది. తాను కూడా మహిళనే అన్న విషయాన్ని మరిచి గర్భిణిని హింసించింది. మహిళా ఎస్ఐ ప్రవర్తించిన తీరుతో.. ఆ గర్భిణి మండుటెండలో 3 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని సారత్ పోలీసు స్టేషన్ పరిధిలో మార్చి 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
బిక్రం బిరూలి అనే వ్యక్తి గర్భిణి అయిన తన భార్య గురుబరి బిరూలిని బైక్పై ఎక్కించుకుని రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గమధ్యలో వారి బైక్ను మహిళా ఎస్ఐ రీనా భక్సల్ ఆపింది. ఒకరే హెల్మెట్ ధరించారని, సీటు వెనుకాల కూర్చున్న గర్భిణి హెల్మెట్ ధరించనందుకు రూ. 500 జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపింది. రూ. 500 తక్షణమే స్థానిక పీఎస్ లో చెల్లించాలని ఆదేశించింది.
ఆన్లైన్లో చెల్లిస్తానని బిక్రం చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. పోలీసు వాహనంలో అతన్ని పీఎస్కు తరలించారు. గర్భిణిని పోలీసులు అక్కడే ఉంచారు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. చేసేదేమీ లేక ఆ గర్భిణి.. పోలీసు స్టేషన్కు చేరుకునేందుకు ఎర్రటి ఎండలో 3 కిలోమీటర్లు నడిచింది. ఆ తర్వాత తన భర్తను పోలీసు స్టేషన్ నుంచి విడిపించుకుంది. మార్చి 29న భార్యాభర్తలిద్దరూ కలిసి మయూర్భంజ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ.. మహిళా ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..