మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 29: మద్యం సేవించి వాహనం నడిపారో.. జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ర్యాష్ డ్రైవింగ్ చేయడం, పోటీపడి వేగంగా బైక్లు నడిపితే కటకటాలపాలవ్వాల్సిందే. మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల కలిగే ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండలంలోని నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి గ్రామాల్లో ప్రధానంగా తనిఖీలు చేపడుతున్నారు. ఉదయం 11 నుంచి రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మందుబాబుల కిక్కు వదిలిస్తున్నారు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్టేషన్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు దాదాపుగా మధ్య వయస్సు కలిగినవారే.
మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపిస్తున్నాం. ముఖ్యంగా మద్యం సేవించి రోడ్డుపై వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఉదయం 10 నుంచి మొదలుకొని సాయంత్రం 10 వరకు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేసి మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహనను కల్పిస్తున్నాం. ఒకసారి కేసులో పట్టుబడిన వారు మళ్లీ దొరికితే వారి కుటుంబ సభ్యులను పిలిచి వారి ఎదుటే కౌన్సిలింగ్ చేస్తున్నాం. కాలేజీ విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిని సారించాం. డ్రంక్అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువగా మైనర్ విద్యార్థులే పట్టుబడుతున్నారు. త్వరలోనే అన్ని కాలేజీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అంశంపై అవగాహనా సదస్సులను నిర్వహిస్తాం. మందు సేవించిన శాతాన్ని బట్టి ఫైన్ లేదా, జైల్ శిక్ష, ట్రాఫిక్ కేంద్రాల వద్ద పనిచేయిస్తాం. – శ్రీనివాస్రెడ్డి, ట్రాఫిక్ సీఐ, కుషాయిగూడ