హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పీఆర్సీ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనున్నది. ఈ మేరకు వివిధ సంఘాలకు పీఆర్సీ కమిటీ ఆహ్వానాలను పంపింది.
మే 15న బీఆర్కే భవన్లో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని బహుజన క్లాస్ టీచర్స్ అసొసియేషన్ (బీసీటీఏ), 16న సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) తదితర సంఘాలకు ఆహ్వానాలు పంపించింది. ఇటీవలే పీఆర్సీ కమిటీ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రతిపాదనలను సంఘాలు కమిటీ ముందుంచాయి.