ప్రజలను పట్టి పీడించుకుతింటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడం సబబేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే, తనిఖీల సందర్భంగా కొందరు పోలీసుల వ్యవహార శైలి విస్మయానికి గురి చేసింది. బడా ఫైనాన్షియర్లతో అంటకాగే కొందరు ఖాకీలు సోదాల విషయమై ముందుగానే ఉప్పందించినట్లు తెలిసింది. మరోవైపు, పక్కా ఆధారాలతో పట్టుబడిన ఓ బడా ఫైనాన్షియర్ను వదిలేయడం ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతున్నది. ఇంకోవైపు, తీవ్ర వేధింపులతో అమాయకుల ఆత్మహత్యలకు కారణమైన వ్యాపారుల వైపు పోలీసులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ప్రజల అత్యవసర పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఫైనాన్షియర్లు దోచుకుంటున్నారు. రూ.లక్ష అప్పు ఇస్తే, అందులో ముందుగానే 20-30 శాతం వడ్డీ రూపంలో కోత పెడుతున్నారు. పైగా ష్యూరిటీ కింద బంగారం, వెండి నగలను కుదువ పెట్టుకోవడం, ఆస్తిపత్రాలు, పట్టా పాసుబుక్కులు, ఖాళీ చెక్కులను సైతం తీసుకుంటున్నారు. ఇక రూ.10-20 వడ్డీ వసూలు చేస్తూ జనం నడ్డీ విరగ్గొడుతున్నారు. పొరపాటున వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే ఇంటికొచ్చి నానా రభస చేస్తున్నారు. దీంతో అవమాన భారంతో చాలా మంది తనువు చాలిస్తుండగా, మరికొంత మంది ఉన్నది అమ్మేసి అప్పులు తీర్చేస్తున్నారు. తెలిసీ తెలియక ఫైనాన్షియర్ల వద్దకు వెళ్లి ఇరుక్కుపోయి.. ఏళ్ల కొద్దీ వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలను చెల్లించుకుంటూ దినదిన గండంగా గడుపుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో బహిరంగంగానే ఆఫీసులు తెరిచి మరీ డబ్బుల దందాను నడుపుతున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేకున్నా గుట్టుగా దందాను కొనసాగిస్తున్నారు. వీరి ఆగడాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఖాకీలు పట్టించుకోవడం లేదని సమాచారం. పోలీసులు ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండటంతో చాపకింద నీరులా పాతుకుపోయిన ఫైనాన్షియర్ల రాక్షసత్వానికి అడ్డుకట్ట పడుతుందని బాధితులు ఆశతో ఉన్నారు. ఒకట్రెండు రోజుల సోదాలతో కాకుండా ఫైనాన్షియర్ల ఆగడాలను పూర్తిగా అరికట్టాలని బలంగా కోరుతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని ఉమ్మడి మండలానికి చెందిన ఓ ఫైనాన్షియర్ అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజలను వేధించడంలో పేరొందాడు. జనాలను దోచుకుంటున్న సదరు తాకట్ల వ్యాపారికి అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడు ఒక రు అండగా నిలవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఫైనాన్స్ వ్యాపారంపై ఫోకస్ చేసిన సీపీ కల్మేశ్వర్ తన సిబ్బందిని రంగంలోకి దించారు. దీంతో బాన్సువాడ నియోజకవర్గంలోని సదరు తాకట్ల వ్యాపారి నివాసంలో సోదాలు చేయగా భారీగా డబ్బు, సంచులకొద్దీ ప్రామిసరీనోట్లు, ఒప్పంద పత్రాలు బయటపడ్డాయి. దీంతో సదరు ఫైనాన్షియర్ అధికార పార్టీ నాయకుడ్ని ఆశ్రయించగా, ఆయన పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ఆ నేత ఆదేశాలతో పోలీసులు అతడ్ని వదిలేయడంతో పాటు స్వాధీనం చేసుకున్న డబ్బు, పత్రాలు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. సదరు పోలీసుస్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే ఈ వ్యవహారమంతా బయట పడుతుందని స్థానికులు చెబుతున్నారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లలో పోలీసులు కొంత మందిని కావాలనే కాపాడినట్లు చర్చ జరుగుతున్నది. నిజామాబాద్ నగరంలో గతంలో పలువురు ఆత్మహత్యలకు కారణమైన ఫైనాన్షియర్ల జోలికి వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం ఎప్పటి నుంచో వేళ్లూనుకుంది. ఫైనాన్షియర్ల ఆగడాలకు కుటుంబాలకు కుటుంబాలే బలైన ఉదంతాలు కూడా ఉన్నాయి. సరిగ్గా రెండేండ్ల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పప్పుల సురేశ్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకుంది. ఫైనాన్షియర్ల ధన దాహానికి కుటుంబం మొత్తం బలి అయిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీకి చెందిన ఓ నాయకుడే ఈ వ్యవహారంలో ప్రధాన ముద్దాయి కాగా, కొద్దికాలం పరారీలో ఉన్న సదరు నేత.. ఆ తర్వాత పోలీసులను మచ్చిక చేసుకుని కేసును సెటిల్మెంట్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారుల దుర్మార్గాలకు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా దందా నడిపిస్తూ సామాన్యులను పట్టి పీడిస్తున్న వ్యాపారులు అంతటా ఉన్నారు. ఈ అక్రమ వ్యాపారంలో కొంత మంది పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం ఉండడం గమనార్హం. తమ పేరు, పలుకుబడిని అడ్డంగా పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్మును అవసరంలో ఆదుకున్నట్లుగా బిల్డప్ ఇచ్చి అమాయకులను ఉచ్చులోకి లాగుతున్నారు. అయితే, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఫైనాన్షియర్ల ఆగడాలకు పోలీసులు కళ్లెం వేస్తుండడంపై హర్షం వ్యక్తమవుతున్నది. అదే సమయంలో కొంత మందిని వదిలి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫైనాన్షియర్లపై పోలీసు దాడుల విషయం ముందుగానే లీక్ అయినట్లు తెలిసింది. వడ్డీ వ్యాపారులతో చనువుగా ఉండే కొందరు పోలీసులే వారిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ తదితర మండలాల్లో పేరొందిన బడా ఫైనాన్షియర్లపై దాడులు జరగక పోవడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు, బహిరంగంగానే ఆఫీసులు తెరిచి మరీ ఫైనాన్స్ దందాలు నడుపుతున్న వారిపైనా పోలీసులు ఫోకస్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. ఫైనాన్షియర్ల నుంచి ముడుపులు తీసుకుంటూ వారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.