న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇచ్చినా.. డెల్టా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కొత్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో.. కరోనా నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని పోల్చిచూస్తే డెల్టా వేరియంట్ నుంచి అత్యధిక రక్షణ పొందారని తేలింది. ముందుస్తుగా టీకాలు వేయడం ద్వారా తర్వాత వైరస్ సోకినా తీవ్రం కాకుండా చూస్తాయని నిపుణులు పేర్కొన్నారు. హిమోరల్ అండ్ సెల్యూలర్ ఇమ్యూనిటీ అనేది డెల్టా వేరియంట్పై పోరాడుతూ రక్షణ అందివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుందని రుజువునిస్తోందని అధ్యయనం తెలిపింది.
బయో ఆర్క్సివ్ ప్రీ ప్రింట్ సర్వర్లో ఈ అధ్యయనం శుక్రవారం పోస్ట్ చేయగా.. ఇంకా పరిశీలించలేదు. ‘న్యూట్రలైజేషన్ ఆఫ్ డెల్టా వేరియంట్ విత్ సెరా ఆఫ్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ అండ్ కొవిడ్-19 రికవర్డ్ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్’ పేరుతో పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, న్యూరోసర్జరీ, కమాండ్ హాస్పిటల్ (సదరన్ కమాండ్), ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, పూణేకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ, కమాండ్ హాస్పిటల్ (సదరన్ కమాండ్) శాస్త్రవేత్తల బృందం అధ్యయనం నిర్వహించింది. డెల్టా వేరియంట్ (B.1.617) వేరియంట్ దేశంలో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.