హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం.. ఆపై పదేండ్లపాటు తెలంగాణ పునర్నిర్మాణం. అలుపెరగని పని.. నిత్యం బిజీబిజీ.. ఇది ఒకవైపు. కేసీఆర్ ఎవర్నీ కలవరంటూ నిందలను నిజాలుగా నమ్మించే ప్రచారం. అయినా కేసీఆర్పై ప్రజల్లో ఉండే అభిమానం మాత్రం ఇసుమంతైనా చెరిగిపోలేదని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనంలో కేసీఆర్కు ఉండే క్రేజే వేరని నిరూపిస్తున్నాయి.
ఆయన రోడ్షోలకు పోటెత్తుతున్న జనమే ఇందుకు ఇందుకు నిదర్శనం. గతనెల 24న మిర్యాలగూడలో మొదలై సూర్యాపేట, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్లలో కేసీఆర్ రోడ్షోలు నిర్వహించారు. ఇవి రోడ్షోలే అయినా బహిరంగ సభలను తలపిస్తున్నాయి.
ఆయన ప్రసంగాలకు జనం జై కొడుతున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు నిర్వహించిన రోడ్షోల ద్వారా ప్రజలతో మమేకం అయ్యారు. గులాబీ బాస్కు స్వాగతం పలికేందుకు యువత ఉరకలెత్తుతున్నది. కేసీఆర్ను పిల్లలకు చూపిస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీల కోసం తహతహలాడుతున్నారు.
గుండెల్లో గులాబీనాదం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పని ఇక అయిపోయినట్టేనని కాంగ్రెస్, బీజేపీ పనిగట్టుకొని ప్రచారం చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జోరుగా సాగింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కేసీఆర్ జనంలోకి రావడం, నల్లగొండ, కరీంనగర్ సభల్లో తానున్నానంటూ రైతు లోకానికి కేసీఆర్ భరోసా ఇవ్వడంతో సమీకరణల్లో ఒక్కసారిగా మార్పు మొదలైంది.
ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అకాల వర్షాలు, సాగునీటి కష్టాలతో అల్లాడుతున్న రైతు లోకానికి ధైర్యం కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికల ముంగిట రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీకి మింగుడుపడని అంశాలుగా పరిణమించాయి. గతనెల 24 నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ జనంలోకి రావడంతో అప్పటిదాకా ఉన్న వాతావరణంలో మార్పు మొదలైంది.
ఆ మార్పును బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా కాంగ్రెస్ కూడా గుర్తించింది. ‘కేసీఆర్ జనంలోకి వస్తే జనం మూడ్ను తిరిగి తమవైపునకు తిప్పుకోవడం కష్టం’ అని ప్రభుత్వంలో క్రియాశీల పాత్రపోషిస్తున్న నాయకుడు ఒకరు స్వయంగా ముఖ్యమంత్రితో పేర్కొన్నప్పుడు ఆయన అసహనం ప్రదర్శించినట్టు తెలిసింది.
సందిగ్ధం నుంచి స్పందన
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలకు, ప్రస్తుతం కేసీఆర్ నిర్వహిస్తున్న రోడ్షోలకు స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. అప్పట్లో జనం నుంచి ఆశించినంత స్పందన రాలేదు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ చెప్తున్న ప్రతి మాటను ఆలకిస్తున్నారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీల అమలపై ప్రజల్లో మొదలైన అసంతృప్తి క్రమంగా పెరిగి పెద్దదైంది. కేసీఆర్ను పోగొట్టుకుని తాము ఏం కోల్పోయామో తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది బీఆర్ఎస్కు అనుకూలంగా మారింది.
గులాబీ జయకేతనమే
కేసీఆర్ రోడ్షోలకు వస్తున్న స్పందనతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఖాయమేనని తేలిపోయింది. రోడ్షోల సందర్భంగా కేసీఆర్ ఆయా నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నల్లగొండ, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియెజకవర్గాల్లో రోడ్ షోలకు హాజరైన ప్రజలతో కేసీఆర్ సంభాషించారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తెలంగాణ ప్ర యోజనాలకు ఎలా అనివార్యమే వివరించారు. అంతకుముందు చేవెళ్ల, జహీరాబాద్, మెదక్ లోక్సభ పరిధిలో, ఎన్నిక ల షెడ్యూల్కు ముందు నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించడం, ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కష్టాల్లో ఉన్న రైతులకు ధైర్యాన్ని ఇవ్వడం వంటి పరిణామాలతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ మాట వింటున్నారు. కేసీఆర్ నడిచిన బాటనే నడుస్తామనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.