హైదరాబాద్: అకాల వర్షాలు రైతులకు (Farmers) కన్నీళ్లు మిగిల్చాయి. మార్కెట్ యార్డుల్లో, కళ్లాల్లో ఎండబెట్టిన ధాన్యం తడిపోయింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) సబ్ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మోత్కూర్-భువనగిరి ప్రధాన రహదారిపై రైతులు భైటాయించారు. 40 రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తికాకపోడంతో.. మార్కెట్ యార్డుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలుచేసి వెంటనే రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో మోత్కూర్-భువనగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇక జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతపూర్లో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో మెదక్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కళ్లాల వద్ద ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ధాన్యం తడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు కవర్లు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బస్తాల్లో నింపిన వడ్లు కూడా తడిసిముద్దయ్యాయి. జిల్లాలో 1.13 లక్షల క్వింటాళ్ల ధాన్యానికిగాను ప్రభుత్వం ఇప్పటివరకు 16 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యం క కల్లాల్లోనే ఉంది.