KCR | దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం నాడు పటాన్చెరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ డజనుకుపైగా స్థానాల్లో గెలిస్తేనే పార్లమెంటులో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తదని.. ఆ విధంగా అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడినప్పుడు 2 లక్షల చిల్లర ఓటర్లు ఉండేవాళ్లని.. ఇయ్యాల 4 లక్షలు దాటిండ్రు అని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దానికి కారణం.. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టిన టీఎస్ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు.. అని అన్నారు. ఇక్కడ పరిశ్రమలు పెరుగుతుండటంతో దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పొట్ట గడుపుకుంటున్నారు. దీంతో పటాన్చెరు ఒక హబ్గా తయారైందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగినయి కాబట్టి ఇతరులు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు.. మనకు కూడా అవకాశాలు దొరుకుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేసీఆర్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పర్మిషన్లు ఇవ్వడంలేదని.. పర్మిషన్ కోసం స్క్వైర్ ఫీట్కు రూ.75 ఇవ్వాలని అడుగుతున్నాడని.. దీంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. ఇంతకుముందు పటాన్చెరులో గజం ధర ఎట్లుండె.. ఇప్పుడు అడిగేటోళ్లు కూడా లేరని చెప్పారు. దీనంతటికీ కారణం కాంగ్రెస్సే అని చెప్పారు.
ఒకప్పుడు పటాన్చెరులో కలుషిత జలాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యేవారని.. కానీ మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా పెట్టి శుభ్రమైన నీటిని అందించామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ నీళ్లు తక్కువ అవుతున్నాయని చెప్పారు. ‘ పక్కనే ఉన్న కొల్లూరులో ఇండియాలో ఎక్కడా లేని విధంగా 16,500 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పేదలకు ఇచ్చినం. కానీ ఇవాళ అవన్నీ ఏవీ కాలేదని.. అబద్ధాలు చెప్పి.. ఎంతసేపు కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారని.. అధికారంలోకివ చ్చిన తర్వాత వాటిలో ఒక్కటైనా నెరవేరిందా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లకు ఒక ఫ్రీ బస్సు చేసిండ్రు.. దాంతో ఆడవాళ్లు తన్నుకు తస్తున్నారు.. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ విధంగా ఆ ఒక్కటి తప్ప ఏదీ చేయలేదు. ఏమైందని ముఖ్యమంత్రిని అడిగితే.. కనబడ్డ దేవుడి మీద ఓట్లు.. కేసీఆర్ మీద తిట్లు అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. ‘ ఝూటా హామీలు చెప్పినవని ప్రశ్నిస్తే.. కేసీఆర్ నీ గుడ్లు పీకుతా.. గోటీలు ఆడుకుంటా.. కేసీఆర్ నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా.. ఆఖరకు నీ ముడ్డి మీద చెడ్డి గుంజుకుంటా అంటాడు.. చెడ్డి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు.’ అని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి.. మంచిగున్న తెలంగాణను ఆగమాగం చేసిందని మండిపడ్డారు.
ఇవాళ చందానగర్లో 24 గంటల నుంచి కరెంటు రాకపోతే సబ్స్టేషన్పై దాడి చేసిండ్రు అని కేసీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్లో కరెంటు కోతలు.. కరెంటు పోతే ఎప్పుడు వస్తదో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా లాభం లేదని ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారని చెప్పారు. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతామని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కార్నింగ్ అనే సంస్థ.. ఈ ప్రభుత్వ వైఖరి, కరెంటు కోతలు చూసి తమిళనాడుకు తరలివెళ్లిపోయిందని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన గతి ఏం కావాలో దయచేసి ఆలోచించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గోదావరి, కృష్ణా నీళ్లు మనవి మనకే ఉండాలన్నా.. మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా.. కళ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా.. అనేక ఫ్యాక్టరీలు మన పటాన్చెరుకు రావాలన్నా మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలని కోరారు. బీఆర్ఎస్ డజనుకుపైగా స్థానాల్లో గెలిస్తేనే పార్లమెంటులో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తదని.. ఆ విధంగా అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.