Income Tax Raid | ఉత్తప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ముగ్గురు బడా షూ వ్యాపారుల ఇండ్లపై ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ.40కోట్లకుపైగా నగదు వెలుగుచూసినట్లు సమాచారం. ఎంజీరోడ్కు చెందిన బీకే షూష్, ఢక్రాన్కు చెందిన మన్షు ఫుట్వేర్, ఆసుఫోటిడా మండికి చెందిన హర్మిలాప్ ట్రేడర్స్పై ఆదాయపు పన్నుశాఖ శనివారం దాడులు జరిపింది. వ్యాపారుల దగ్గర దొరికిన నగదును లెక్కించేందుకు బ్యాంకుల నుంచి ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాలను తీసుకువచ్చారు. ఆదివారం వేకువ జాము వరకు నోట్ల లెక్కింపు కొనసాగింది.
ఆదాయపు పన్ను ఎగవేత గురించి సమాచారం మేరకు.. ఆదాయపు పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్, ఆగ్రా, లక్నో, కాన్పూర్స్కు చెందిన ఉద్యోగులు ఏకకాలంలో ముగ్గురు వ్యాపారవేత్తలకు చెందిన ఆరు ప్రదేశాలపై దాడులు జరిపారు. ఎంజీ రోడ్డులోని బీకే షూస్ సంస్థతో పాటు సూర్యనగర్లోని ఇంట్లో సోదాలు చేశారు. షూ ట్రేడింగ్ చేస్తున్న మన్షు ఫుట్వేర్, బీకే షూస్ ఓనర్స్ ఇద్దరు బంధువులు కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరూ మంచి గుర్తింపు పొందారు. హర్మిలాప్ ట్రేడర్స్ షూ మెటీరియల్ డీల్ చేస్తుంది.
ఆయా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు, బంగారం కొనుగోళ్లపై అందిన పక్కా సమాచారం మేరకు 12 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించారు. ఇద్దరు వ్యాపారవేత్తలు భారీగా భూములపై పెట్టుబడులు పెట్టారని.. పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర భారీగా పెట్టుబడులు పెట్టారు. దాడులు నిర్వహించిన అధికారులు ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారి నుంచి డేటాను స్వాధీనం చేసుకున్నారు. రశీదులు, బిల్లులతో పాటు స్టాక్ రిజిస్టర్ పరిశీలనలో అనేక విస్తుపోయే సమాచారం లభించింది. కంపెనీ తన ఐఫోన్ లాక్ని ఓపెన్ అన్లాక్ చేయలేదని.. అందులో అనేక రహస్యాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.