Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది. వీరి ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్ III కంటే ఎక్కువని తెలిపింది. రెండేళ్ల క్రితం సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సునాక్ దంపతులు.. గతేడాది 275వ స్థానంలో నిలిచారు.
తాజాగా వెల్లడైన జాబితాలో సునాక్ దంపతులు 245వ స్థానంలో నిలవగా.. కింగ్ చార్లెస్ (King Charles III) మాత్రం 258వ స్థానంలో ఉండటం గమనార్హం. బ్రిటన్లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్ తాజా జాబితాను విడుదల చేసింది. కింగ్ చార్లెస్ సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు చేరుకుంది.
సునాక్ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్ పౌండ్ల నుంచి 651 మిలియన్ పౌండ్లకు పెరిగింది. అయితే రాజ కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని తాజా నివేదిక పేర్కొంది. వారికి ఎన్నో ఎస్టేట్లు, ప్యాలెస్లు ఉన్నాయని, వాటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉంటుందని అంచనా వేసింది. సునాక్ దంపతుల మొత్తం సంపద ఏడాది కాలంలోనే 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
2022-23లో రిషి సునాక్ సుమారు రూ.23 కోట్లు (2.2 మిలియన్ పౌండ్లు) సంపాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివెడెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు (13 మిలియన్ పౌండ్లు) అందుకున్నారు. వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్లో ఉన్న షేర్లే కావడంతో ఇది గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.