పెద్దపల్లి/ పెద్దపల్లి కమాన్/పెద్దపల్లి రూరల్/ పెద్దపల్లి టౌన్ ఆగస్టు 29 : అద్భుత పథకాలతో తెలంగాణ దేశానికే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణలో ప్రభుత్వ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దబొంకూరు శివారులోని ఎస్సారెస్పీ క్యాంపులో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేద పండితులు పూర్ణకుంభంతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రధానద్వారం వద్ద పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి లోనికి ప్రవేశించారు. అదే విధంగా కలెక్టరేట్ భవనంలోని గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగులు ప్రస్తుత స్ఫూర్తితో పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో నిలుపాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని తెలిపారు. బంగారు తెలంగాణ సాఫల్యం కోసం అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఐజీ నాగిరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్దాల అశోక్తేజ, జిల్లా అదనపు కలెక్టర్లు వీ లక్ష్మీనారాయణ, కుమార్దీపక్, రామగుండం ఇన్చార్జి సీపీ సత్యనారాయణ, డీసీపీలు, ఏసీపీలతో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.