కూసుమంచి, ఏప్రిల్ 12 : పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు రావడంతో వేసవి గండం నుంచి గట్టెక్కినైట్లెంది. 23 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ ఎండల తీవ్రత దృష్ట్యా 5.5 అడుగుల అట్టడుగు స్థాయికి చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన సాగర్లో వదిలిన నీటిని 7వ తేదీన నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగర్ డ్యాం నుంచి పాలేరు వరకు 135 కి.మీ దూరం పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల గస్తీతోపాటు రిజర్వాయర్ చుట్టూ నిరంతరం నిఘా పెట్టి నీటి చౌర్యం ఎక్కడా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో పాలేరు రిజర్వాయర్లో నీరు 18.50 అడుగులకు చేరింది. ఈ నీటిని ఐదు జిల్లాల్లోని 2,435 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు వినియోగించనున్నారు. అయితే నీటి వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మే చివరి నాటికి తాగునీటికి మళ్లీ ఇబ్బదులు తలెత్తే పరిస్థితి ఉంది.
పాలేరు నుంచి రా వాటర్ను తీసుకొని జీళ్లచెరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాదిరిపురం వద్ద డబ్ల్యూటీపీ ప్లాంట్లో నీటిని శుద్ధి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చండ్రుపట్ల వద్ద ప్లాంట్లో నీటిని శుద్ధి చేస్తున్నారు. అలాగే ఖమ్మం నగరానికి తాగునీటి కోసం దానవాయిగూడెంకు నీటిని అందిస్తున్నారు.
పాలేరు రిజర్వాయర్ నుంచి 135 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ కోసం వినియోగిస్తున్నారు. దీంతో రోజుకు 0.20 అడుగుల నీటిమట్టం తగ్గుతుంది. ఇలా వేసవి ముగిసే వరకు సుమారు 60 రోజులపాటు ఇప్పుడున్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎక్కడా నీటి ట్యాంపరింగ్ జరగకుండా చర్యలు చేపట్టడంతోపాటు కాల్వపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాలేరులో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.588 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 1.785 టీఎంసీలు ఉన్నాయి.