KCR | కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బలం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది. నాకు గుర్తులేకపోతే మీరు గుర్తు చేస్తున్నరు. రైతుబంధు రావాలి. ఎందుకు? మాకు బుర్రలేకపెట్టినమా? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ, మద్దతు లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అశోక్ గులాటీ ఆగ్రో ఎకానమిస్ట్తో అనేక మాసాలపాటు చర్చించి ఓ నిర్ణయం తీసుకొని రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశాం. రైతుబంధు ఇచ్చాం. కరెంటు ఇచ్చాం. నీటి తీరువా లేకుండా చేశాం, పాత బకాయిలు రద్దు చేశాం. ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం’ అన్నారు.
‘వీళ్లు వచ్చి ఏం మాట్లాడుతరు? మేం ఐదెకరాలు ఉంటెనే ఇస్తం.. ఐదెకరాలకు ఇంచి ఇవ్వం. ఆరెకరాలున్నోడో కోటీశ్వరుడా? 20-25 ఎకరాల తర్వాత ఇయ్యాంటె అర్థముంటది? పదెకరాలకు కూడా ఎగపెడుతమంటే ఇదెక్కడి న్యాయం. వీళ్ల మెడలు వంచి పాత పద్ధతిలో జరిగేటట్టు చేయాలి ? ఆ పని జరగాలి. జరగాలంటే బీఆర్ఎస్ బలం ఇవ్వాలి. ఇంకో మాట. అజయ్ నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు, మంచినీటి వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా జరిగినయ్. ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినయ్. ఇవాళ ఖమ్మం పట్టణంలో ఎన్నిరోజులకోసారి నీళ్లు వస్తున్నయ్. మూడురోజులకోసారి వస్తున్నయ్. ఈ గతి మనకు ఎందుకు వచ్చింది. మళ్లీ వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే వచ్చింది? నీళ్లు లేకనా.. చేతగాకనా.. చేవలేకనా.. కాంగ్రెస్ అసమర్థతనా? పిచ్చి ఆవేశంలో కాకుండా వాస్తవంగా కూర్చొని ఆలోచిస్తే.. మూడునాలుగు నెలల్లోనే ఇవన్నీ మాయమవుతయా? తొమ్మిదేళ్లు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే.. ఇవాళ ఎందుకు మాయమైంది?’ అంటూ నిలదీశారు.
‘ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్కన నల్లగొండ జిల్లాలో నీటిశాఖ మంత్రి.. ఇద్దరు మంత్రులుండగ కూడా కాలువలో నీళ్లెందుకు రాలేదు. పాలేరు దగ్గర మేమే బద్దలు కొడుతం తూములని రైతులు ఎందుకుపోయి దండయాత్ర చేశారు ? అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినయ్. ఇవన్నీ చర్చించాలి. ఈ దేశం మీది.. రాష్ట్రం మీది.. భవిష్యత్ మీది. యువత ఓ ఒరవడిలో కొట్టుకుపోవద్దు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా. అందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వర్రావును గెలిపించాలని.. బీఆర్ఎస్కు బలం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ కోరికలు నెరవేర్చాలంటే బీఆర్ఎస్కు శక్తి కావాలి. ఆ శక్తి మీరే ఇవ్వాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగింది.. అయిపోయింది. మళ్లీ విజృంబిద్దాం.. పోరాటం చేద్దాం.. అన్నీ కాపాడుకుందాం’ అన్నారు.
‘గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం అటు కొత్తగూడానికి రెండు మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. కేంద్రం జిల్లాకో నవోదయ ఇవ్వాలి. కొత్తగా ఏర్పడిన కొత్తగూడానికి రావాలి. వచ్చిందా నవోదయ పాఠశాల ? ఎందుకు రాలేదు. బీజేపీ ఎంపీలు ఏం చేశారు. కేంద్రమంత్రి ఏం చేశాడు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లు.. కాంగ్రెస్కు ఓటు వేస్తే ఏం జరిగిందో మీరు చూస్తున్నరు. ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్కు శక్తి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకుపోయే పద్ధతుల్లో నిర్మాణం చేసే బీఆర్ఎస్కు బలం ఇవ్వాలి. నామా నాగేశ్వర్రావు నిజాయితీ పరుడు. ఉన్న శక్తి మేరకు ప్రజలకు పని చేసేవాడు. పెద్దస్థాయికిపోయే అవకాశం ఆయనకే ఉంది. నామా నాగేశ్వర్రావు ఓటేసి గెలిపించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.