KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా వరికోతలు ఉండేవని.. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కరెంటు కోతలేనని.. ఇది జరుగుతున్న చరిత్ర అంటూ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘ఎక్కడికి పోయింది కరెంటు. తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందిన కరెంటు ఎక్కడికి పోయింది? కరెంటు కోతలు ఉన్నయా? నేను మహబూబ్నగర్లో మాజీ శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రెండుసార్లు కరెంటుపోయింది అని చెప్పిన. నన్ను ఇబ్బందిపెట్టాలని తీసేసారా? వాళ్ల అసమర్థతనా పోయింది.. పోయిందని ట్విట్లర్లో పెట్టాను’ అని తెలిపారు.
‘నేను పెట్టిన పోస్టును చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, కరెంటు మంత్రి భట్టి విక్రమార్క.. భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క. ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తడు. కేసీఆర్ అబద్ధాలకోరు. అబద్ధం చెప్పుతున్నడని చెప్పిండు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఓ సర్కూల్యర్ జారీ చేశారు. కరెంటు, నీటి కొరత ఉంది హాస్టల్ మూసివేస్తున్నాం.. ఇంటికిపోండని చెప్పి ఇచ్చిండు. దాన్ని నేను మళ్లీ ఇవాళ ట్విట్టర్లో పెట్టిన. అయ్యా భట్టి విక్రమార్క ఇది చూడండి. మీ ఘనత ఎంతో ఉందో.. ఎక్కడో మహబూబ్నగర్, ఖమ్మం కాదు.. ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్లు ఇచ్చే దిక్కులేదని పెట్టిన. ఏం చేశారో తెలుసా? చీఫ్ వార్డెన్ ఎవరైతో ఉన్నరో ఆయనకు నిన్ను ఎందుకు సస్పెండ్ చేయవద్దు అని నోటీస్ ఇచ్చారు. మీరు సస్పెండ్ చేస్తరు కదా? కానీ కోతలు నిజమే కదా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరికోతలు.. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు. ఇది జరుగుతున్న చరిత్ర’ విమర్శలు గుప్పించారు.
‘ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు. కేసీఆర్ ఒక లక్ష మాఫీ చేసిండు. మీరు ఉరకండి రూ.2లక్షల రుణం తెచ్చుకోండి. డిసెంబర్ 9నాడు 10.30 గంటలకు మాఫీ చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ అయ్యిందా? కాకపోంగ ఏమవుతున్నది. భద్రాద్రి రామయ్యపై ఒట్టు. బాసర సరస్వతిపై ఒట్టు. యాదగిరి నర్సన్నమీద ఒట్టు. ఎన్ని ఒట్లు పెట్టుకుంటవ్ ముఖ్యమంత్రి ? ఎవరు నమ్ముతరు. ఆగస్టు 15లోపలో రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి.. నేను రాజీనామా ఇస్తున్నా అని రాజీనామా ఇచ్చిండు. కానీ, ముఖ్యమంత్రి పోలేదు. తోకముడిచిండు. అబద్ధాలు మాట్లాడి.. అడ్డగోలు హామీలు ఇచ్చి.. ప్రజలను బురిడీలు కొట్టించి గద్దెకు వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రూ.2500 ప్రతి మహిళకు ఇస్తామన్నరు. ఎవరికైనా వచ్చిందా? వచ్చే ఆశ కూడా ఉన్నదా? ఇన్ని అబద్ధాలా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతుంది’ అన్నారు.
‘శాసనసభలో, బయట బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నరు. నేను జానారెడ్డిని కాదు.. నేను ఫలానా కాదు.. కేసీఆర్ నీ గుడ్లుపీకి గోళీలు ఆడుకుంటా? నిన్ను పండపెట్టి తొక్కుతా? నిన్ను చర్లపల్లి జైలులో వేస్తా? నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా? ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషా? దయచేసి ఆలోచన చేయాలి. 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో ఈ తెలంగాణ చెరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి.. అనేక లాఠీ దెబ్బలు తిని.. జైలులకు పోయినం. ఇప్పటికీ నాపై రైల్వే కేసున్నది. కోర్టు రమ్మని నోటీసులు ఇస్తున్నది. తెలంగాణ సాధించిన వ్యక్తిని పట్టుకొని.. ధీమాగా ఉన్న రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్ను జైలులో వేస్తా.. పండపెట్టి తొక్కుతా? ఇదా భాషా? జైలులో వేస్తా అంటే కేసీఆర్ భయపడుతడా? జైలులకు తోకమట్టకు నేను భయపడుతనా? జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా?’ అని ప్రశ్నించారు.
‘అబద్ధాలు, మోసం చేసే వ్యక్తులు ఎంతో కాలం ఉండలేరు. వాళ్లు వాళ్లే చెప్పుకుంటున్నరు. బీజేపోళ్లు స్టేట్మెంట్లు ఇస్తున్నరు. పార్లమెంట్ ఎన్నికలు అయిన తెల్లారే రేవంత్రెడ్డి మా బీజేపీలోకి జంప్కొడుతరని చెబుతున్నరు. ఎవడు ఎందులోకి జంప్కొడుతడో.. ఎవడు ఎందులో ఉంటడో.. ఏం జరుగుతుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి. ఒక్కనాడు కూడా దాన్ని ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు. వాళ్లకు అభివృద్ధిపై దృష్టి లేదు. ప్రజల సంక్షేమం లేదు. నాగార్జున సాగర్లో 495 అడుగుల్లో నీరున్నా కూడా ఆ నాడు నేను పంటలకు నీళ్లు ఇప్పించినా ఖమ్మం, నల్లగొండ జిల్లాకు.
ఒక్కసారి కూడా పంటలు ఎండనివ్వలేదు. పాలేరు ఎప్పుడూ మత్తడి దుంకే పరిస్థితి ఉండేది. ఇవాళ 510 అడుగులున్నా.. నేను హెచ్చరించినా పంటలు ఎండబెట్టారే తప్పా నీళ్లు ఇడ్వలేదు. ఇప్పుడు ఉపేందర్రెడ్డి చెబుతున్నడు సార్ మా నేలకొండపల్లి మండలంలో పంటలు బాగా ఎండిపోయినయ్ అని చెబుతున్నడు. నాకు ఆశ్చర్యమేసింది. భక్త రామదాసుకు ఏమంది? బ్రహ్మాండంగా ప్రాజెక్టు కట్టినం కదా? అంటే.. అనేక రకాలు బాధలు సర్. పాలేరు ఎండబెట్టినరు. కరెంటు కూడా సరిగా ఇయ్యలేదు. చాలా పంటలు ఎండిపోయినయ్ అని చెబుతున్నరు. రైతుబంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా? పోరాడుతామా?’ అని ప్రశ్నించగా.. పోరాడుదామని జనం నినదించారు.