KCR : ప్రధాని నరేంద్రమోదీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకపోతననే ప్రతిపాదనను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అప్పుడు నేను నా తల తెగిపడ్డా సరే ఒప్పుకోనని తెగేసి చెప్పానని తెలిపారు. ఇప్పుడు మోదీ మళ్లీ అదే మాట చెప్తుంటే తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లడుతలేరని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఖమ్మం రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
‘నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో కూడా నరేంద్రమోదీ గోదావరి నీళ్లు తరలించుకపోయే ప్రతిపాదన తెచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేలేదాకా నా తల తెగిపడ్డా సరే ఒప్పుకోను అని తెగేసి చెప్పిన. అదీ బీఆర్ఎస్ పార్టీ పాలసీ. మరి వీళ్లకు (బీజేపీ, కాంగ్రెస్ నేతలు) ఓట్లు కావాలె. సీట్లు కావాలె. కేంద్రంల మంత్రి పదవులు కావాలె. అంతేగాని మన సమస్యలు, మన నీళ్లు, మన పంటలు, మన రైతులు వీళ్లకు పట్టరు’ అని కేసీఆర్ విమర్శించారు.
‘నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తున్న. కేంద్రంలో బీజేపీకి 400 సీట్లు, 370 సీట్లు గోవిందా..! ఏం వస్తలేవు. రెండు వందల సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. యావత్ ప్రపంచం కోడై కూస్తున్నది. నేను మీకో మంచి మాట చెప్తున్నా. రాష్ట్రంలో ఎక్కడిపోయినా ప్రజలు ఇదే పద్ధతిలో బ్రహ్మరథం పడుతున్నరు. దాదాపు 12 పార్లమెంటు స్థానాలు మనం గెలువబోతున్నం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది. మీరు నామాను గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయితడు. అంత పెద్ద లాభం మనకు జరుగుతది. నామా కేంద్రంలో మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉన్నది’ అని కేసీఆర్ అన్నారు.
‘ఈ నరేంద్రమోదీ దాడి నుంచి, ఈ చేతగాని చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరిని రక్షించుకోవాలన్నా.. మన కృష్ణా నదిని రక్షించుకోవాలన్నా, మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా.. మన హక్కులు సాధించుకోవాలన్నా.. బీఆర్ఎస్ బలంగా ఉండాలె. బీఆర్ఎస్ పార్టీ అయితేనే పేగులు తెగేదాక కొట్లాడుతది’ అని కేసీఆర్ చెప్పారు.