గ్లాస్గో : ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో టాప్-5 లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. అనుకున్నది సాధించింది. గతంతో పోలిస్తే భారత్కు పతకాలు లభించే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలను ఈసారి తొలగించినా టోర్నీలో ఆడించిన ఆటల్లోనే మన క్రీడాకారులు సత్తాచాటి పతకాల పట్టికలో దేశాన్ని నాలుగో స్థానంలో నిలిపారు. ముఖ్యంగా బాక్సర్లు అంచనాలకు మించి పసిడి పంచ్లు విసిరి గ్లాస్గోలో స్వర్ణ చరిత్ర లిఖించగా అథ్లెట్లూ మునుపెన్నడూ లేని రికార్డులను తిరగరాస్తూ పతకాల మోత మోగించారు. బాక్సర్లు, వెయిట్ లిఫ్టర్లు, అథ్లెట్లు మెరవడంతో ఈ టోర్నీలో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలు సాధించి నాలుగో స్థానంతో టోర్నీని ముగించింది. ఆస్ట్రేలియా అగ్రస్థానాన ఉండగా ఇంగ్లండ్, కెనడా.. భారత్ కంటే ముందున్నాయి. ఈ క్రీడల తర్వాతి ఎడిషన్ (2030)కు భారత్లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది.
ఈసారి దేశానికి పసిడి కాంతులు పంచడంలో బాక్సర్లదే హవా. పలు క్యాటగిరీల్లో పదిమంది బాక్సర్లు ఫైనల్స్కు అర్హత సాధిస్తే వారిలో ఏకంగా ఏడుగురు పసిడి పంచ్లు విసరగా ముగ్గురు రజతాలతో మెరిశారు. ముఖ్యంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు దుమ్మురేపారు. ఏడు స్వర్ణాల్లో ఐదుగురు (ప్రీతి పవార్, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి, జైస్మీన్ లంబోరియా) వారివే కాగా ఇద్దరే అబ్బాయిలు (సచిన్, అంకుశ్) గోల్డ్ గెలిచారు. బాక్సర్ల కంటే ముందు రెజ్లర్లు సత్తాచాటి 8 మెడల్స్ గెలుచుకున్నారు. వీరిలో మీరాబాయి స్వర్ణం సాధించగా జ్ఞానేశ్వరి, హర్జీందర్, రిషికంఠ, అజయ్ బాబు, లవ్ప్రీత్ రజతాలతో మెరిశారు.
ఈ క్రీడల చరిత్రలో స్వర్ణం గెలువని జుడోకాలు ఈసారి అ‘ద్వితీయ’ ప్రదర్శనతో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. డోపింగ్ తంటాలు, లగేజీ సమస్యలతో సతమతమైనా యువ జుడోకాలు అస్మిత, హర్ష్ సింగ్ గోల్డ్ మెడల్స్తో కొత్త చరిత్ర సృష్టించారు. యామిని రజతంతో మెరవగా ఉన్నతి కాంస్యంతో సరిపెట్టుకుంది.
అథ్లెటిక్స్లో భారత్ ఈసారి 9 పతకాలు గెలుచుకుంది. పదివేల మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ దేశానికి తొలిసారి (రజతం) పతకం అందించగా అతడే.. 5వేల మీటర్ల రేసులోనూ కాంస్యం గెలిచి సీడబ్ల్యూజీలో రెండు మెడల్స్ గెలిచిన ఫస్ట్ ట్రాక్ అథ్లెట్(భారత్)గా రికార్డులకెక్కాడు. తేజస్వినీ శంకర్ డెకథ్లాన్లో దేశానికి తొలి పతకాన్ని తీసుకొచ్చాడు. జావెలిన్ త్రో అంటేనే దేశానికి గుర్తొచ్చే నీరజ్ చోప్రాతో పాటు భారత్లో కొత్త అథ్లెట్ దూసుకొచ్చాడు. యశ్వీర్ సింగ్ కాంస్యం గెలిచి భవిష్యత్ ఆశాకిరణంలా కనబడుతున్నాడు. పారా అథ్లెట్ల విషయానికొస్తే షాట్పుటర్ షర్మిల ధనకర్ (ఎఫ్57) పారా క్రీడల్లో తొలి స్వర్ణాన్ని దేశానికి అందించింది. ఇక పురుషుల వంద మీటర్ల టీ47 ఈవెంట్లో దిలీప్ గవిత్.. 10.71 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి సీడబ్ల్యూజీలో కొత్త రికార్డు నెలకొల్పాడు.
ఆటల ఆఖరి రోజైన ఆదివారం భారత్కు పతకాలేమీ రాలేదు. జూడోలో భారత్ ఆశలు పెట్టుకున్న ఇష్రూప్ (మహిళల 78 కిలోలు).. బ్రాంజ్ మెడల్కు అర్హత సాధించినా ఆ పోరులో నెగ్గలేకపోయింది. పురుషుల 100 కిలోల విభాగంలో అవతార్ సింగ్, యశ్ ఘంఘాస్ రౌండ్ ఆఫ్-16లోనే ఇంటిబాట పట్టారు. ట్రాక్ సైక్లింగ్లో భాగంగా మెన్స్ 1000 మీటర్ల టైమ్ ట్రయల్లో రొనాల్డోతో పాటు పారా సైకిలిస్ట్ లిషా దాస్ సైతం నిరాశపరిచారు.
