ఖమ్మం, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం, మంగళవారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న ఆయన.. సోమవారం సాయంత్రం ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. ఇప్పటికే పలు జిలాల్లో బస్సు యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న బీఆర్ఎస్ అధి నేత.. మరో కొన్ని గంట ల్లోనే ఖమ్మం గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామంలో కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో కేసీఆర్ ఈ యాత్రను చేపట్టారు. దానిలో భాగంగానే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్షోను విజయంతం చేయడానికి ఉమ్మం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు విశేషంగా కృషిచేస్తున్నారు.
గత ఏడాది నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. భద్రాచలం నియోజకవర్గం మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఖమ్మం జిల్లా నుంచే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉండడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ నుంచి జిల్లాలో ప్రాతినిథ్యం వహించే వారు లేనట్లయింది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయ తీరానికి నడిపించేందుకు కేసీఆర్ బస్సుయాత్ర దోహద పడుతుందని పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఖమ్మం నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుంది. రాత్రి వరకు కొనసాగతుంది. ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు ప్రాంతానికి మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మయూరిసెంటర్, వైరా రోడ్ మీదుగా జడ్పీ సెంటర్కు చేరుకుంటారు. బస్సుయాత్రతోపాటు ప్రజలు కాల్వొడ్డు నుంచి కేసీఆర్ బస్సుతోపాటు జడ్పీ సెంటర్కు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ మీదుగా శ్రీశ్రీ సర్కిల్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. అక్కడ నుంచి మమత ఆసుపత్రిలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇంటికి కేసీఆర్ చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడ బస చేస్తారు. మంళవారం తల్లాడ మీదుగా కొత్తగూడెం చేరుకుంటారు. ఈ బస్సు యాత్రలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, బానోత్ మదన్లాల్, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొననున్నారు.