న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం కోటి డోసులకుపైగా అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 80 లక్షలకుపైగా అదనంగా మోతాదులు పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. యూపీ, మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల వద్ద టీకాల బ్యాలెన్స్ అత్యధికంగా ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు దాదాపు 15.7కోట్ల మోతాదులను రాష్ట్రాలకు, యూటీలకు ఉచితంగా అందించామని, ఇందులో వృథా సహా 14.6 కోట్ల డోసులు వినియోగించినట్లు పేర్కొంది.
టీకా డోసులు నిండుకోవడంతో వ్యాక్సినేషన్ ప్రభావితమైనట్లు మహారాష్ట్రకు చెందిన కొందరు అధికారులను ఉటంకిస్తూ వచ్చిన వార్తలపై ఈ సందర్భంగా కేంద్రం వివరణ ఇచ్చింది. ఏప్రిల్ 27న ఉదయం 8 గంటల వరకు మహారాష్ట్ర 1,58,62,470 డోసులు అందుకుందని, ఇందులో 0.22శాతం వృథా అవగా.. 1,49,39,410 డోసులు వినియోగించిందని కేంద్రం పేర్కొంది. అర్హత ఉన్న వ్యక్తులకు టీకాలు వేసేందుకు 9,23,060 డోసులు రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో మూడు లక్షల డోసులు పంపించనున్నట్లు పేర్కొంది.